HYD | మన సంస్కృతి, ఆచారాలను అనుసరిస్తున్న ప్ర‌పంచ దేశాలు.. త‌ల‌సాని

ప్రపంచ దేశాలు మన సంస్కృతి, ఆచారాలను అనుసరిస్తున్నాయని, అది తెలుగు వారిగా మనకు ఎంతో గర్వకారణమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం రాత్రి రవీంద్రభారతిలో శ్రీ గీతిక కూచిపూడి ఆర్ట్ అకాడమీ 27 వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అకాడమీ విద్యార్ధులు వివిధ వేషధారణలతో ప్రదర్శించిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు బాల్యం నుండే మన సాంప్రదాయాలు, సంస్కృతి గురించి అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. సంగీతం, నృత్యం కలయికే కూచిపూడి అని పేర్కొన్నారు. 17వ శతాబ్దంలో ప్రారంభమైన కూచిపూడి నృత్యానికి నేటికి విశేష ఆదరణ ఉందని చెప్పారు.

పిల్లలను చదువుతో పాటు క్రీడలు, వివిధ కళల్లో కూడా ప్రోత్సహించాలని కోరారు. కూచిపూడి నృత్యాన్ని అనేక దేశాల్లో ప్రదర్శిస్తుండటం ఎంతో సంతోషించదగ్గ విషయమ‌న్నారు. బాల్యం నుండే తమ పిల్లలు క్రమశిక్షణతో సన్మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలన్నారు. పిల్లలను ఖాళీ సమయాల్లో వారిని సెల్ ఫోన్ లు, టీవీలకు ఆకర్షితులు కాకుండా వివిధ రంగాల్లో ఉన్నతంగా రాణించే విధంగా అవసరమైన శిక్షణ ఇప్పించాలని చెప్పారు. మన సంస్కృతిని ప్రపంచ దేశాలు ఎంతో గౌరవిస్తూ అనుసరిస్తుంటే మన యువత పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులు కావడం విచారకరమ‌న్నారు. నేటి తరం పిల్లల్లో అనేక మందికి మన పండుగలు, వాటి చరిత్ర గురించి తెలవదని, వాటిని పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

అకాడమీని ఏర్పాటు చేసి వేలాది మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చిన అకాడమీ నిర్వహకులు లక్ష్మి కృష్ణ, అనంత కృష్ణలను ఆయన అభినందించారు. తమ పిల్లలకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇప్పిస్తూ మన సంస్కృతిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్ బీఆర్ఎస్, పార్టీ డివిజన్ అద్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply