ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : న్యాయవ్యవస్థకు అవినీతి జాడ్యం పట్టుకుందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆరోపించారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో రూ.500 కోట్ల డబ్బు దొరికింది. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఒక జడ్జి ఇంటికి పోవాలంటే, మంచినీళ్ల బాటిల్ ను కూడా చెక్ చేస్తారు. 500 కోట్ల రూపాయలు జడ్జి ఇంటికి చేరిందంటే, ఇది ఒక రోజులో జరిగిన పని కాదు..ఆ డబ్బు ఒక సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు చెందినదని, న్యాయవాదులు, సుప్రీంకోర్టు న్యాయమార్థులు ఢిల్లీలో చెప్పుకుంటున్నారన్నారు. పోలీసులకు, కేంద్ర హోంమంత్రికి, ప్రధానికి తెలియకుండా అంత డబ్బు వెళ్లదు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఏటీఎంలా పోలవరం…
పోలవరం డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. పోలవరం ఏటీఎం లాగా మారిందని ప్రధాని గతంలో అన్నాడు. దీనిపై విచారణ ఎందుకు వేయలేకపోతున్నారనీ చింతామోహన్ ప్రశ్నించారు. చిలకలూరిపేటకు చెందిన ఒక మాజీ మంత్రిపై కోటి రూపాయలు తిన్నదని, ఆమెపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. వేల కోట్ల రూపాయలు పోలవరంపై తిన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటే, సిబిఐ విచారణ కాదు కదా, కనీసం ఏసీబీ విచారణ కూడా జరిపించకపోవడంలో అంతర్యమేమిటన్నారు. పోలవరంపై ఒక రకమైన ఆలోచన? చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యేపై మరో రకమైన ఆలోచన ఎందుకు అన్నారు. తిమింగలాలను పట్టుకోకుండా, చిన్న చిన్న కుందేళ్ళను పట్టుకుంటున్నారు. ఒక బీసీ మహిళపైన విచారణ సమంజసం కాదన్నారు.
ఈరోజున్న రాజకీయ నాయకుల్లో ఎవరు తినడం లేదు.. వావిలాల గోపాలకృష్ణ, కాకాని వెంకటరత్నం, ఎన్జీరంగా తినలేదు. అటువంటి నాయకులు ఇప్పుడు లేరన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు కలిగినటువంటి దేశం భారతదేశం. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన దేశం భారతదేశం. స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలు నిండింది. రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య రాజకీయ హత్య అన్నారు. మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు అని దీన్ని ఖండిస్తున్నానన్నారు. రాజమండ్రిలో పరిస్థితులు క్షుణ్ణంగా గమనిస్తూ వచ్చాను. ఎవరైనా కొంచెం రెచ్చగొట్టి ఉంటే, రాజమండ్రి రాజమండ్రిలా ఉండేది కాదు. రాష్ట్రం రావణ కాష్టంగా అయివుండేదన్నారు. కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే, నా స్టడీ టూర్లు అన్నారు. కర్నూలు నుంచి, శ్రీకాకుళం వరకు పెద్ద పెద్ద లీడర్లతో మాట్లాడుతున్నాను. తగిన సమయం వచ్చినప్పుడు, వాళ్ళంతా కాంగ్రెస్ లోకి వస్తారని చింతామోహన్ వివరించారు.