కాంగ్రెస్ 420 హామీలపై 420 అడుగుల ఫ్లెక్సీతో నిరసన
వెయ్యి రోజుల పాలనపై పుట్ట మధుకర్ ఆగ్రహం
హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శ
మంథని, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 420 హామీలను ప్రభుత్వం పాతర పెట్టిందని ఆరోపిస్తూ మంథని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. వెయ్యి రోజుల పాలన పూర్తయినా ప్రజలను మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలను ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు.
మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి కూడా హామీల అమలులో విఫలమయ్యారని పుట్ట మధుకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే 420 అడుగుల ఫ్లెక్సీతో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
