- నవీన్ యాదవ్ మీ మద్య పెరిగినోడు
- ఒక్క అవకాశం ఇవ్వండి ..
- ఎమ్మెల్యేగా గెలిపించండి.. – సీఎం రేవంత్రెడ్డి
- జూబ్లీహిల్స్లో వందల కోట్లతో అభివృద్ది పనులు చేపడతాం
- బీఆర్ఎస్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో జరిగిన కార్నర్ మీటింగ్లలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు హస్తం గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
యువకుడు, చురుకైన నాయకుడు నవీన్ యాదవ్ ప్రజల సమస్యల కోసం ఎప్పుడూ ముందుంటారని, ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్యే ఉన్నారని గుర్తుచేశారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పార్టీలది “ఫెవికాల్ బంధం” అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని, తన అభ్యర్థికి డిపాజిట్ పోగొట్టుకునైనా సరే బీఆర్ఎస్ను గెలిపించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
మహిళల పట్ల కేటీఆర్ సానుభూతి ఒక డ్రామా అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తన సొంత చెల్లెలు కల్వకుంట్ల కవితను ఇంటి నుంచి వెళ్లగొట్టిన వ్యక్తి కేటీఆర్. అలాంటి వ్యక్తి ఇతర మహిళల పట్ల సానుభూతి చూపిస్తే ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు తాను చేప్పడం కాదని.. కేటీఆర్ చెల్లెలే మహబూబ్ నగర్ లో బహిరంగంగా వెల్లడించారని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ సానుభూతి వలలో ప్రజలను పడేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మాగంటి గోపినాథ్ను మూడుసార్లు గెలిపించినా ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కేసీఆర్ ఒక్కసారి అయినా నియోజకవర్గంలోకి వచ్చారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇక్కడ డ్రైనేజీ సమస్య ఉందని తెలియదా ? అంటూ ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్లో పుట్టి పెరిగిన నవీన్ యాదవ్ మీ సమస్యలను బాగా అర్థం చేసుకుంటారు. ఆయనను గెలిపించండి, మీ అభివృద్ధి నా బాధ్యత. వందల కోట్లతో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాం అని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్, మంత్రి అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

