ముంబై – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సుంకాల పెంపు అమలును ఏకంగా మూడు నెలలు వాయిదా వేశారు.. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయ సమాజం ఊపిరి తీసుకుంది.. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలతో అమెరికా షేర్ మార్కెట్ తో సమా అన్ని అంతర్జాతీయ మార్కెట్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.. లక్షలాడి బిలియన్ ల డాలర్ల గత వారం రోజులలో మదుపురులు నిండా మునిగారు.. ఇటీవల ట్రంప్ తీసుకున్న వాణిజ్య విధాన మార్పుల కారణంగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయి. బిలియనీర్ ఇన్వెస్టర్లు ట్రంప్ విధించిన టారిఫ్లను తీవ్రంగా విమర్శించారు. పలు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు అమెరికాలో మాంద్యం వస్తుందని హెచ్చరించారు. స్ట్రాటజిస్ట్లు స్టాక్ మార్కెట్ లాభాల అంచనాలను తగ్గించారు. ట్రంప్ ప్రపంచ వాణిజ్యాన్ని మళ్లీ తీర్చిదిద్దాలన్న యత్నంలో పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని కలిగించాడు.
ట్రంప్ నిర్ణయాలపై విమర్శలు రావడంతో పెద్దన్న మనసు మార్చుకున్నారు.. మూడు నెలలు సుంకాలు పెంపు అమలు ఉండదని ఒక ప్రకటన విడుదల చేయడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం పుంజుకున్నాయి. . పెట్టుబడిదారులు గత కొన్ని రోజులుగా భయాందోళనలతో ఎదురుచూస్తున్న సమయానికి తెరపడటంతో, మార్కెట్లలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే, చైనాపై టారిఫ్లను మాత్రం 125%కి పెంచింది. ఇది ట్రంప్ టారిఫ్ విధానంలో సడలింపు వచ్చినప్పటికీ, చైనాపై మాత్రం ఒత్తిడి కొనసాగిస్తుంది.
ఇక నేడు ఆసియా మార్కెట్లలో ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు పెరిగింది. జపాన్ నిక్కీ 225 ప్రారంభ ట్రేడింగ్లో ఒక్కసారిగా దూసుకుపోయింది. ఉదయం ట్రేడింగ్లో ఏకంగా 8.3 శాతం ఎగిసింది. ఆస్ట్రేలియాలో ASX 200 ఆరు శాతానికి పైగా దూసుకుపోయింది. సురక్షిత పెట్టుబడిగా భావించే జపనీస్ యెన్, డాలర్తో పోలిస్తే 0.64 శాతం పెరిగి 146.83 యెన్లకు చేరుకుంది. బంగారం ధర కూడా 0.5 శాతం పెరిగి ఔన్సుకు 3,097 డాలర్లకు చేరింది.
ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్ కూడా ఉదయం ట్రేడింగ్లో 6% పైగా పెరిగింది. S&P/ASX 200 సూచిక 6.3% పెరిగి 7,842.90 పాయింట్లకు చేరుకుంది. బుధవారం ఈ సూచిక 1.8% పడిపోయింది. అంటే, ఒక్క రోజులోనే మార్కెట్ తన మునుపటి నష్టాలన్నింటినీ దాదాపుగా పూడ్చుకుంది. ట్రంప్ తన సుంకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని పెట్టుబడిదారులు స్వాగతించడంతో మార్కెట్ ఒక్కసారిగా కళకళలాడింది.
న్యూజిలాండ్ బెంచ్మార్క్ NZX 50 సూచిక 3.7% పెరిగి 12,237.61 పాయింట్లకు చేరుకుంది. ఈ లాభాలు నిలబడితే, మార్చి 2020 చివరి నుండి ఇదే అత్యుత్తమ రోజు అవుతుంది. మార్కెట్లలో ఇంతటి ఉత్సాహం చాలా కాలం తర్వాత కనిపించింది. అటు టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ నిక్కీ 225 ట్రేడింగ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే 7.4% పెరిగి 34,052.58 వద్ద ట్రేడ్ అయింది. ఇది పెట్టుబడిదారుల ఉత్సాహానికి అద్దం పడుతోంది. సియోల్లో కూడా కోస్పి సూచిక 5.4 శాతం పెరిగింది. మొత్తం మీద, ఆసియా మార్కెట్లలో గురువారం ఉదయం ట్రేడింగ్ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
నేడు భారత స్టాక్ మార్కెట్ కు సెలవు.
సెలవు భారత స్టాక్ మార్కెట్లు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) నేడు శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించారు..తిరిగి ఇక్కడ . శుక్రవారం ట్రేడింగ్ జరుగుతుంది. ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయం, మార్కెట్లకు కొత్త ఊపిరినిచ్చింది. గత కొన్ని రోజులుగా భయాందోళనలతో ఉన్న పెట్టుబడిదారులు, ఒక్కసారిగా ఊరట చెందారు. మార్కెట్ నిపుణులు ఈ పరిణామాన్ని సానుకూలంగా అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయం వెనక్కి తీసుకోవడం, ప్రపంచ వాణిజ్యానికి మేలు చేస్తుందని వారు భావిస్తున్నారు. అయితే, ఈ ఉత్సాహం ఎంతకాలం నిలబడుతుందో వేచి చూడాలి.