Monday, September 16, 2024

Jaishankar | భారత్‌కు నేపాల్‌ విద్యుత్‌..

భారతదేశానికి దాదాపు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను నేపాల్‌ ఎగుమతి చేయనుందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పారు. సోమవారం నేపాల్‌ విదేశాంగ మంత్రి అర్జురాణా దేవుబాతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ, భారత్‌కు విద్యుత్‌ను ఎగుమతి చేయాలనే నేపాల్‌ నిర్ణయాన్ని కొత్త మైలురాయిగా అభివర్ణించారు. తమ చర్చల్లో వాణిజ్యం, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారంపై దృష్టి సారించామన్నారు.

బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేవుబా మొదటిసారి ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చారు. జైశంకర్‌తో చర్చలు ఉత్పాదకంగా ఉన్నాయని దేవుబా అభివర్ణించారు. ద్వైపాక్షిక ప్రయోజనాలు, నేపాల్‌-భారత్‌ సంబంధాలపై పరస్పర సహకార మార్పిడి గురించి చర్చించామని ఆమె ఎక్స్‌లో తెలిపారు. ఈ పర్యటన రెండుదేశాల మధ్య శతాబ్దాల నాటి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రాంతంలోని మొత్తం వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా నేపాల్‌ భారతదేశానికి ఒక ముఖ్యమైన పొరుగు దేశం. రెండు దేశాల నాయకులు రెండు వైపుల పురాతన ”రోటీ బేటీ” సంబంధాన్ని తరచుగా గుర్తించారు. సిక్కిం, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అనే ఐదు భారతీయ రాష్ట్రాలతో నేపాల్‌ 1,850 కి.మీ పైగా సరి#హద్దును పంచుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement