Wednesday, September 18, 2024

అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారత్‌ నుంచి 22 సంస్థలు

ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీల జాబితాను టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది. టైమ్‌ బెస్ట్‌ కంపెనీస్‌ 2024 పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 1000 కంపనీలను పేర్కొంది. ఈ జాబితాలో మన దేశం నుంచి 22 కంపెనీలకు స్థానం దక్కింది.

ఈ జాబితాలో ప్రముఖ టెక్‌ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తొలి స్థానంలో నిలిచింది. మొత్తం జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 112వ ర్యాంక్‌ సాధించింది. మన దేశ సంస్థల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. దీని తరువాత 119వ ర్యాంక్‌తో ఇన్ఫోసిస్‌, 134 ర్యాంక్‌తో విప్రో, 187 ర్యాంక్‌తో మహీంద్రా అండ్‌ మహీంద్రా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

బ్యాంక్‌ల విభాగంలో 504 ర్యాంక్‌తో యాక్సిస్‌ బ్యాంక్‌ ముందు వరసలో ఉంది. 518 ర్యాంక్‌తో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరువాతి స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 525 ర్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 551 ర్యాంక్‌ని సాధించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు 646వ ర్యాంక్‌, అదానీ గ్రూప్‌కు 736వ ర్యాంక్‌లో ఉన్నాయి.

ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, సమానత్వం ఆధారంగా టైమ్‌ మ్యాగజైన్‌ కంపెనీలకు ర్యాంకింగ్‌ ఇచ్చింది. 50 దేశాల్లోని మొత్తం 1,70,000 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. 2023 నాటికి కంపెనీలు 100 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న వాటిని ఈ జాబితాకు ఎంపిక చేసింది.

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరికొన్ని భారత్‌ సంస్థల్లో ఎల్‌ అండ్‌ టీ 549 ర్యాంక్‌, ఐటీసీ 586, హీరో మోటోకార్ప్‌ 597, మథర్‌సన్‌ గ్రూప్‌ 697, ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ 752, యెస్‌ బ్యాంక్‌ 783, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 850, గోద్రెజ్‌ 921, బజాజ్‌ గ్రూప్‌ 952, సిప్లా 957, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ 987, ఎంఆర్‌ఎఫ్‌ 993 ర్యాంక్‌తో చోటు దక్కించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement