కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ
ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై బీఆర్ఎస్ నిరసన
రేగొండ, ఆంధ్రప్రభ : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు ఏమైందని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను బుధవారం రేగొండ మండల కేంద్రంలో ప్రజలకు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ మండల తాజా మాజీ అధ్యక్షుడు అంకం రాజేందర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అంకం రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. వివిధ వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని అంకం రాజేందర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హింగే మహేందర్, సామల పాపిరెడ్డి, కోలేపాక భిక్షపతి, బండి రమేష్, చేరి వీరన్న, మూలగుండ్ల శ్రీనివాస్రెడ్డి, బండి భద్రయ్య, ఇప్పకాయల రాజశేఖర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
