బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్ఐవీ పరీక్ష చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. జీ7 దేశాల నాయకుల్లో హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న మొదటి దేశాధినేత స్టార్మర్ అని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. హెచ్ఐవీ పరీక్ష వార్షికోత్సవం సందర్భంగా ఆయన టెస్ట్ చేయించుకున్నారని తెలిపింది. దేశ ప్రజలంతా ఈ టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చింది.
ఈసందర్భంగా స్టార్మర్ మాట్లాడుతూ… హెచ్ఐవీ టెస్ట్ చాలా ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్షణాల్లో పరీక్ష పూర్తవుతుందని… వారం రోజుల పాటు ఈ పరీక్షను ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. 2030 నాటికి కొత్త హెచ్ఐవీ కేసులు నమోదు కాకూడదనే లక్ష్యాన్ని అందుకోవడానికి అందరూ ముందుకొచ్చి టెస్టు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.