ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : మోరాంచ వాగు పై చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. సోమవారం ఘనపూర్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో (వెళ్తుర్లపల్లి క్రాస్ నుండి సీతారాంపూర్ ) బ్రిడ్జి నిర్మాణ పనులను వారు పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… వర్షాల వలన మోరంచ వాగు ప్రవహించి అటు వెళ్ళు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉండేదన్నారు. చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య ఉందన్నారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ సమస్యను పరిష్కారం కోసం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జికి సుమారు రూ.15కోట్లతో మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే పలు గ్రామాలకు రాకపోకలకు రవాణా సౌకర్యాలు సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.