28 ఆలయాల్లో బోనాల పండుగ
పొరపాట్లు లేకుండా చూడాలి
బడ్జెట్ లోటు లేదు.. ఇప్పటికే ₹20 కోట్లు కేటాయింపు
అధికారులకు మంత్రి ఆదేశాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆషాఢం (Ashadam) వస్తోంది.. బోనాల (Bonalu) పండుగను పొరపాటు లేకుండా అద్భుతంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda surekha) ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరూ బోనాల పండుగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుపుకుంటారన్నారు. ఈ పండగను విజయవంతం చేయాలని కోరారు.
28 ఆలయాల్లో బోనాల జాతర
సమీక్ష సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ హైదరాబాద్లో 28 ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర జరుగుతుందన్నారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, గోల్కోండ కోటలో బోనాలు సమర్పించుకోవడంతో తెలంగాణ బోనాలు మొదలవుతాయి. ఆషాఢ మాసపు మొదటి గురువారం బోనాలు ప్రారంభమవుతాయి. చివరి ఆదివారం వరకు ప్రతి రోజూ విశేష పూజలు జరుగుతాయి. తొలుత గోల్కొండలో(Golkonda) ప్రారంభమైన బోనాలు ముగిసిన తర్వాత వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ వారం సికింద్రాబాద్ అంతటా బోనాలు జరుపుకుంటారు. ఆ తర్వాతి నుంచి లాల్ దర్వజా, ధూల్పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల జరుగుతాయి. ఆయా ఆలయాలకు ప్రముఖుల తాకిడి కూడా ఉంటుందని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రూ.20 కోట్లు కేటాయింపు
బోనాల పండగకు బడ్జెట్ లోటు చేదని, రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు. గతంలో వచ్చిన సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నది ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. సమీక్షలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకట రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.