Delhi | అనిల్ అంబానీకి ఈడీ సమన్లు..

ఢిల్లీ : ఒకప్పుడు దేశంలోనే దిగ్గజ వ్యాపారవేత్తగా, అపర కుబేరుడిగా వెలుగొందిన అనిల్ అంబానీ (Anil Ambani) కి వరుస షాకులు తగులుతున్నాయి. రిలయన్స్ (Reliance) అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ అధినేత ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటీవల రూ. 17వేల కోట్ల విలువైన లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి.. అనిల్ అంబానీకి చెందిన పదులకొద్దీ కంపెనీలపై దాడులు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) తాజాగా ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈనెల 5న ఢిల్లీ (Delhi) లోని ఈడీ ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ఇందులో భాగంగానే.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలం రికార్డ్ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద.. ముంబైలో అనిల్ అంబానీకి చెందిన దాదాపు 50కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ వంటివి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఏకంగా 35 వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి తాజాగా చర్యలు చేపట్టింది. దీంతో అప్పటి నుంచి అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు పతనం అవుతున్నాయి. ముందుగా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు.. రూ.వేల కోట్ల మేర బ్యాంక్ లోన్ ఫ్రాడ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపైనే కేసు నమోదైంది. ఇంకా గతంలో యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాలు.. ఇతర షెల్ కంపెనీలకు అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంకా లోన్ కోసం బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం కూడా ఇచ్చినట్లు అభియోగాలున్నాయి.

Leave a Reply