బద్రీనాథ్: ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో ఇవాళ ఉదయం మంచు చరియలు విరిగిపడ్డాయి. వాటికింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ ధావ్లోని జాతీయహైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్డీఓ) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణపనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్డీ క్యాంప్ కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 57మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీఆర్ మీనా వెల్లడించారు. ఇందులో 10మందిని రక్షించి క్యాంప్ నకు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలంలో అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. అయితే, మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బీఆర్ ఓ అధికారులు వెల్లడించారు.