తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని మాజీమంత్రి, సనత్ నగర్ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నూతన చైర్మన్ గా నియమితులైన గోపిశెట్టి రాఘవేందర్ పాటు వివిధ ఆలయాల కమిటీ చైర్మన్ లు శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, వాటిలో ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలు ఒకటని పేర్కొన్నారు. సుమారు నెల రోజులపాటు బోనాల ఉత్సవాలతో నగరం మొత్తం సందడిగా ఉంటుందని గుర్తు చేశారు.
లక్షలాది గా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ఉప్పుగూడ మహంకాళి ఆలయ చైర్మన్ మధుగౌడ్, బంగారు మైసమ్మ ఆలయ చైర్మన్ మధుసూదన్ యాదవ్, సభ్యులు భవాని శంకర్, గుర్నాథ రెడ్డి, ఆనంద్, శంకర్ యాదవ్ తదితరులు ఉన్నారు.