Saturday, July 6, 2024

AP | అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం.. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌

పిఠాపురంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెడతారని తెదేపా నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

”పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసింది. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారు. అందుకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న మనిషికి అండగా నిలవాలనుకున్నా. మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారు. 100 శాతం స్ట్రయిక్‌ రేటు దేశంలో ఇప్పటివరకు ఎవరూ చూడలేదు.

గతంలో వైకాపా నాయకులు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఉండడు.. హైదరాబాద్‌లో ఉంటాడని ప్రచారం చేశారు. అందుకే పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నా. ఈరోజే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఉద్యోగాలు లేవని, నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిని కాబట్టి వారికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. అధికారులను గౌరవిస్తూనే పనులు చేయించుకోవాలి.

నా కుమార్తె కనిపించడం లేదని ఓ తల్లి వచ్చి తన బాధ చెప్పుకొంది. ఆమె కష్టం తీర్చాలని 9 రోజులు తాపత్రయపడ్డా. 9 నెలల క్రితం కేసు చిక్కుముడిని పోలీసులు త్వరగా ఛేదించారు. అదే వైకాపా ప్రభుత్వం 30 వేల మందికి పైగా ఆడబిడ్డలు కనిపించకుండా పోతే పట్టించుకోలేదు. వ్యవస్థల్లో తప్పు లేదని ఈ ఘటనలతో నిరూపితమైంది. వ్యవస్థలను సరిదిద్దుకోవాలని అధికారులు కూడా చెబుతున్నారు. ఓటర్లు రక్తం చిందించకుండా ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విప్లవం తీసుకొచ్చారు. 151 స్థానాలున్న పార్టీని 11 స్థానాలకు పడగొట్టారు.

కూటమి నేతలు పింఛను పంచలేరని వైకాపా అంటే… తొలి రోజే ఆ పని చేసి చూపించాం. ఒక్క వాలంటీరు సాయం లేకుండానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసింది. వైకాపా హయాంలో అడ్డగోలుగా నిధులు దారి మళ్లించారు. రుషికొండకు చేసిన రూ.600 కోట్ల ఖర్చులో కొంచెమైనా కేటాయించి ఉంటే రోడ్లు బాగుపడేవి. ఉద్యోగులకు జీతాలు అందేవి.

- Advertisement -

ఉప్పాడ తీరం కోత సమస్యకు పరిష్కారం చూపిస్తూ టూరిజం అభివృద్ధి చేస్తాం. అందమైన కోస్టల్‌ రోడ్డును నిర్మిస్తాం. పిఠాపురంలో సెరీకల్చర్‌ను అభివృద్ధి చేస్తాం. గొల్లప్రోలులో ఉద్యానపంటల కోసం శీతల గిడ్డంగి నిర్మిస్తాం. కోటగుమ్మం గేట్‌ వద్ద రైల్వే పైవంతెన కావాలని కేంద్రాన్ని కోరాం. ఏ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా దిల్లీలో మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు.

పిఠాపురం ప్రజల విజ్ఞప్తులను తీసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించా. ఏ వినతులైనా వారు స్వీకరిస్తారు. ఉపాధి, వైద్యం, శాంతిభద్రతల సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడి సాక్షిగా మీకు రుణపడి ఉంటా. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ అయిదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం” అని పవన్‌ కల్యాణ్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement