Friday, September 20, 2024

AP: ఎన్డీఏ కూట‌మితోనే ఉన్నాం… చంద్ర‌బాబు

తాము ఎన్డీఏ కూటమితోనే ఉన్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమితో చేతులు కలిపే అవకాశం ఉందని, ఇప్పటికే కూటమి నేతలు బాబును సంప్రదించారన్న వార్తలకు చెక్ పెడుతూ చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కూటమి ఘన విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మీడియా సహా రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి చంద్రబాబు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే నినాదంతోనే పని చేశామన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లామని అన్నారు. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. బేషజాలు లేకుండా ఎన్నికల్లో కూటమి నేతలు పని చేశారని తెలిపారు. కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని హామీ ఇచ్చారు.

‘నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. 45.60 శాతం టీడీపీకి, 39.37 శాతం వైఎస్సాఆర్​సీపీకు వచ్చాయి. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది. ఐదేళ్లు మా కార్యకర్తలు చాలామంది ఇబ్బందిపడ్డారు. కార్యకర్తలకు కంటినిండా నిద్ర కూడా పోని పరిస్థితి. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని’ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement