Saturday, September 14, 2024

AP: పోలీసుల‌పై జ‌గ‌న్ ఉగ్రరూపం… గుర్తు పెట్టుకుంటా అంటూ వార్నింగ్

అంద్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి : ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమ‌య్యాయి. అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి. పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టదలచుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గు చూపింది. మూడు నెలల కాలానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభకు సమర్పిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టనుంది.

ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఇతర శాసనస‌భ‌, మండలి సభ్యులు.. నల్ల కండువాలను ధరించి ఉభయ సభల్లో ప్రదర్శించడానికి ప్లకార్డులతో అసెంబ్లీకి నేటి ఉద‌యం బ‌య‌లు దేరారు.. అలాగే చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. దారిలోనే పోలీసులు- వైఎస్ జగన్ సహా మిగిలిన సభ్యులందరినీ అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించిన జగన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులతో వాగ్యుద్ధం నెలకొంది. జగన్ సహా మిగిలిన వారిని పోలీసులు వెనక్కి నెట్టే ప్రయత్నానికి దిగడం వారిలో ఆగ్రహావేశాలకు కారణమైంది.

- Advertisement -

దీంతో పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు. తమ చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాక్కుని, చించిపడేసే హక్కు, అధికారం ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు జగన్. మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో.. అంటూ తనను అడ్డుకున్న పోలీసు అధికారిని ఉద్దేశించి హెచ్చరించారాయన. ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా?. అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు.. అంటూ జగన్ హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ఉన్నారని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement