Saturday, October 19, 2024

Visakha – అంగ‌న్‌వాడీ, లైబ్ర‌రీలలో నారా లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీలు

మంత్రి లోకేష్‌కు.. కోప‌మొచ్చింది!
లైబ్ర‌రీ తెర‌వ‌డంలో ఆల‌స్యంపై ఆగ్ర‌హం
అంగ‌న్‌వాడీ, లైబ్ర‌రీల సంద‌ర్శ‌న‌
అంగ‌న్‌వాడీ చిన్నారుల‌కు స‌ర‌దా ప్ర‌శ్న‌లు
చాక్లెట్స్ పంచి సంబుర‌ప‌డ్డ లోకేష్‌
చిన్నారుల‌తో సెల్ఫీలు, ఫొటోలు
లైబ్రరీ తెర‌వ‌డంలో ఆల‌స్యం
రాష్ట్రం వ్యాప్తంగా ప‌ర్య‌వేక్ష‌ణ‌కు అధికారి
ఆదేశాలు జారీ చేసిన విద్యా, ఐటీశాఖ‌ల‌ మంత్రి

ఆంధ్రప్రభ , విశాఖపట్నం బ్యూరో
విశాఖపట్నం నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలను విద్యా, ఐటీ శాఖల‌ మంత్రి నారా లోకేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ బాలల గదిని సందర్శించారు. కొద్దిసేపు చిన్నారులతో సరదాగా గడిపారు. ఏబీసీడీలు, రైమ్స్ వచ్చా అని అడిగారు. మంత్రి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు చిన్నారులు ఆడుతూ పాడుతూ సమాధానాలు ఇచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను ఆరాతీశారు. చాక్లెట్లు పంచిన మంత్రి లోకేష్ చిన్నారులతో కలిసి ఫొటో దిగారు.

గ్రంథాలయం నిర్వహణపై ఆగ్రహం

అంతకుముందు నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయాన్ని మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ… 9.45 గంటలకు కూడా మూసివేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల బలోపేతానికి మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ ను అధ్యయనం చేసి రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయండి అని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement