Saturday, September 28, 2024

AP: పైడితల్లమ్మ సిరిమాను చెట్టు తరలింపు ప్రక్రియ – ఎమ్మెల్యే అదితి గజపతి పూజలు

విజయనగరం, సెప్టెంబర్ 28 (ప్రభ న్యూస్) : శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను వృక్షాలను భూదేవి నుండి వేరు చేసే ప్రక్రియలో భాగంగా శనివారం డెంకాడ మండలం పెదతాడివాడలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్బంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సుమారు గత 250 ఏళ్లుగా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని, ప్రతి ఏడాది పూజారి కలలో కనిపించి అమ్మవారు సిరిమాను వృక్షాన్ని తెలపడం జరుగుతుందని, ఆ వృక్షాన్ని ప్రార్ధించి ఈరోజు భూదేవి నుండి వేరు చేయడం జరుగుతుందన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019లో శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందని, ఫలితంగా ఈసారి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని తెలిపారు. శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ అక్టోబర్ 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీన సిరిమాను ఊరేగింపు జరుగుతుందన్నారు. గత ఏడాది నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయనకు పైడితల్లి అమ్మవారి పండుగ రోజున బెయిల్ రావడం జరిగిందని, ఈ ఏడాది ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన రోజున అమ్మవారి పండుగ పందిరి రాట వేయడం జరిగిందని గుర్తు చేశారు. విజయనగరం ప్రజలను, రాష్ట్ర ప్రజలను శ్రీ పైడితల్లి అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడతారని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement