Saturday, September 21, 2024

Delhi | సుప్రీంకోర్టుకు తిరుపతి లడ్డూ వివాదం…

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో యానిమ‌ల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి ఉపయోగించారనే వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. హిందూ మతాచారాలను అతిక్రమించిన ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖాలైంది.

ఈ మేరకు సత్యం సింగ్ అనే న్యాయవాది.. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని వెల్లడి కావడంతో వెంట‌నే జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ అభ్యర్థించారు. ప్రభుత్వం నియమించిన అధికారుల పర్యవేక్షణలోనే తిరుమలలో ఉల్లంఘన జరిగిందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ విజ్ఞప్తి చేశారు.

‘‘టీటీడీ ట్రస్ట్ గత మేనేజ్‌మెంట్ హయాంలో మాంసాహార ఉత్పత్తులను ‘ప్రసాదం’ తయారీలో ఉపయోగించినట్టు ఇటీవలి పరిశీలనలో ఆందోళన కలిగించే నిజం బయటపడింది. ముఖ్యంగా పక్షి మాంసాన్ని (కోలిస్) వాడారు. ఈ చర్య హిందూ మతపరమైన ఆచారాలు, ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించడమే కాకుండా మత విశ్వాసాలపై దాడి చేసినట్టు అవుతుంది. ప్రసాదం తయారీలో మాంసాహార ఉత్పత్తులను ఉపయోగించడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం రాజ్యాంగ పరిరక్షణపై దాడికి పాల్పడడమే. ఆర్టికల్ 25(1) ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది’’ అని న్యాయవాది సత్యం సింగ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement