Thursday, September 19, 2024

Tirupati – సి.పి.ఆర్ గురించి అవగాహన పెంచుకోండి – ప్రాణ దాతలు కండి – ఎస్పీ సుబ్బరాయుడు

తిరుమల . – ఇటీవల కాలంలో శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లో ఉన్న ఒక మహిళా భక్తురాలు గుండెపోటు తో కుప్ప కూలింది. అయితే సకాలంలో సి.పి.ఆర్. చేసేవారు లేక ఆ మహిళా భక్తురాలు శ్వాస విడిచారు. ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రత్యేక దృష్టి సారించి తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరికి సిపిఆర్ చేయు విధానంపై అవగాహన కల్పించి, తిరుమలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ముఖ్య ఉద్దేశంతో పోలీసు శాఖ, టిటిడి విజిలెన్సు, రెడ్ క్రాస్ వారి సమన్వయంతో ఈరోజు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఒక వ్యక్తి యొక్క గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్ననప్పుడు వెంటనే, పక్కన ఉండే వారు దాన్ని మళ్ళీ కొట్టుకునేలా చేసే ఒక అత్యవసర ప్రక్రియను హృదయ శ్వాసకోశ పునరుజ్జీవన చర్య అంటారన్నారు.ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు.

- Advertisement -

సడెన్ గా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు. చికిత్స అందించడం ఏ మాత్రం ఆలస్యం అయినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నారు.

ప్రతి ఒక్కరూ సిపిఆర్ చేయు విధానాన్ని తెలుసుకుని తిరుమలలో ఏ సమయంలో అయినా భక్తులకు మంచి సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని . సుబ్బరాయుడు పిలుపునిచ్చారు…

రెడ్ క్రాస్ డాక్టర్లు ఈ కార్యక్రమం ద్వారా తిరుమలలో పనిచేస్తున్న పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, శ్రీవారి సేవకులు మరియు ఇతర శాఖల అధికారులు సిబ్బందికి సిపిఆర్ ప్రథమ చికిత్స చేసే విధానాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ, తిరుమల డి.ఎస్.పి విజయ్ శేఖర్, సిఐలు విజయ్ కుమార్ తిరుమల వన్ టౌన్, మురళీమోహన్రావు తిరుమల టూ టౌన్, హరి ప్రసాద్ తిరుమల ట్రాఫిక్, ఎస్ఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement