Tuesday, September 17, 2024

Tholi ekadashi : భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్న ఆల‌యాలు…

ఏపీ, తెలంగాణ‌ల‌లో ఆధ్మాత్మిక శోభ‌
ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ : తొలి ఏకాదశి రోజైన నేడు ఏపీ, తెలంగాణాల్లో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. తొలి ఏకాదశి కావడంతో భక్తులు పూజలు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా ఏపీ, తెలంగాణాల‌లోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయాల వద్ద క్యూలు కట్టారు.

తెలంగాణాలోని యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. ఆలయ అర్చకులు శ్రీ స్వామివారికి మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు, పరివార దేవతార్చనలు నిర్వహించి కల్యాణ మండపంలో 24 గంటల పాటు అఖండ భజన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, అధికారులు కాలినడకన గోదావరి నదిలో త్రివేణి సంగమం వద్దకు చేరుకుని కుండలలో గోదావరి జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే వర్షంలోనే కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద దేవి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

- Advertisement -

తిరుమ‌ల‌లో పొటెత్తిన భ‌క్త‌జ‌నం..
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. భారీ వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే శ్రీశైలం, విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై వెల‌సిన శ్రీ క‌న‌క‌దుర్మ‌మ్మ వారి ఆల‌యం, సింహ‌ద్రి అప్ప‌న్న దేవాల‌యం, అన్న‌వ‌రంల‌లో కూడా భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి ద‌ర్శ‌నాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement