Thursday, October 3, 2024

TTD: ఆ వార్త‌లో నిజం లేదు… ల‌డ్డూ, ద‌ర్శ‌న ధ‌ర‌ల్లో మార్పు లేదు… టీటీడీ

తిరుమల : శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదన‌, టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమ‌ని టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. పలు సామాజిక మాధ్యమాల‌లో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలను టీటీడీ సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియజేయడమైనది.

ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను సంప్రదించొద్దు – భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
ఈ రోజు కొన్ని వాట్స్అప్ గ్రూపుల్లో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతున్నది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్ సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగింది.

భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీల ద్వారా కాకుండా, నేరుగా, రాష్ట్ర టూరిజం వెబ్ సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. భక్తులు గమనించగలరు. అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్ సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని ఇందుకు గాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు త‌మ దృష్టికి వచ్చింది.

- Advertisement -

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగము కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేయడమైనది. అంతేకాకుండా ఇటువంటి దళారుల మాటి నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement