Friday, July 5, 2024

ఆ జిల్లాకు పల్నాడు పేరు పెట్టాలి, సీఎం జ‌గ‌న్‌కు జీవీఎల్ లేఖ‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను ఏర్పాటు చేస్తున్నందున, నర్సారావుపేట పార్లమెంట్ జిల్లాకు ‘గ్రేటర్ పల్నాడు’ లేదా ‘మహా పల్నాడు’ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు కోరారు. ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలని లేఖలో కోరారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, వేగవంతమైన, సమతుల్య అభివృద్ధి కోసం వీలైనంత త్వరగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు. నరసరావుపేట గొప్ప చరిత్ర, సంప్రదాయం కలిగిన పల్నాడు ప్రాంతానికి ముఖ ద్వారం కాబట్టి, నరసరావుపేట కేంద్రంగా కొత్త నరసరావుపేట జిల్లాకు ‘గ్రేటర్ పల్నాడు’ లేదా ‘మహా పల్నాడు’ జిల్లాగా పేరు పెట్టాలని కోరుతున్నట్టు తెలిపారు. తద్వారా ఆ ప్రాంత ఘనమైన చరిత్ర, సాంస్కృతిక గుర్తింపునకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఆ ప్రాంత వెనుకబాటుతనంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సైతం ఉపయోగపడుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement