అమరావతి, ఆంధ్రప్రభ: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు తాళిబొట్లతో నిరసన వ్యక్తం చేసి సభ నుంచి నిష్క్రమించారు. బడ్జెట్ సమావేశాల్లో ఆఖరి రోజైన శుక్రవారం ఉదయం స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన అసెంబ్లిd సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అప్పటికే సభలో ఉన్న తెదేపా సభ్యులు మద్యం మరణాలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపు తమతమ స్థానాల వద్ద నినాదాలు చేసిన తెదేపా ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు.
పోడియంపైకి వెళ్లకుండా మెట్ల వద్ద మార్షల్స్, అసెంబ్లి సహాయకులు అడ్డుగా నిలుచున్నారు. పోడియం వద్ద నిలబడి మద్యం మరణాలపై జ్యుడిషియల్ విచారణ జరపాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్పీకర్ పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో పోడియంపై చేతులతో గట్టిగా కొడుతూ నినాదాలు చేశారు. కొద్ది సేపటి తర్వాత ‘ప్రొటెస్ట్ ‘ చేస్తున్నామంటూ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రశ్నోత్తరాల సమయంలో అనుమతించబోమని స్పష్టం చేశారు. కొద్దిసేపు మద్యంపై నినాదాలు చేసిన తెదేపా ఎమ్మెల్యేలు స్పీకర్, సభకు తాళిబొట్లు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు సభ నుంచి వాకౌట్ చేయడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..