Monday, October 7, 2024

AP | తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టండి : సీఎం చంద్రబాబు

ఏపీలో రోడ్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, దీంతో వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని సీఎం అన్నారు. ఈ పరిస్థితిని మార్చే పనులు మొదలు కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు.

సచివాలయంలో ఆర్అండ్‌బీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. నాడు రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదని సీఎంకు అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని వివరించారు. ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 2,936 కిలోమీటర్ల మేర ఉన్నాయని తెలిపారు. వీటి కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం అని తెలిపారు.

పాత్ హోల్స్ పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యంవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైనా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు.

రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement