Friday, September 20, 2024

AP: చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ పై సస్పెన్షన్ ఎత్తివేత..

సీఎం చంద్రబాబుకు పీఎస్ గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఉన్న విచారణను సైతం ఆపేశారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పీఎస్ గా 15 ఏళ్లకు పైగా పెండ్యాల పని చేశారు. వైసీపీ హయాంలో 4 సార్లు ఆయన సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు.

2023 సెప్టెంబర్ 29న అప్పటి వైసీపీ ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. 2023 అక్టోబర్ 26న ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. 2024 జనవరి 8న పెండ్యాల శ్రీనివాస్ పై విచారణ జరిపేందుకు విచారణాధికారిని నియమించారు. 2024 ఆగస్ట్ 1న విచారణాధికారి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

శ్రీనివాస్ పై ఉన్న అభియోగాలు కొంత వరకు నిరూపితమయ్యాయని సదరు విచారణాధికారి తన నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయనను విధుల్లోకి తీసుకుంటున్నట్టు జీవోలో పేర్కొంది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఆయనను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement