Tuesday, September 17, 2024

AP | విద్యుత్ సరఫరాపై నోడల్ ఆఫీసర్ల పర్యవేక్షణ

  • తుఫాను నేపథ్యంలో సదరన్ డిస్కం ఏర్పాట్లు

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సదరన్ పవర్ డిస్కం (ఎపిఎస్పిడిసిఎల్) పరిధిలో విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లను నియమితులయ్యారు. డిస్కం పరిధిలోని జిల్లాల్లో
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను నోడల్ ఆఫీపర్లు నిర్వహిస్తారు.

సంస్థ పరిధిలోని అనంతపురం సర్కిల్ కు చీఫ్ జనరల్ మేనేజర్ (ట్రైనింగ్స్) డి.ఎస్. వరకుమార్, నెల్లూరు సర్కిల్ కు చీఫ్ జనరల్ మేనేజర్ (ఎనర్జీ కన్సర్వేషన్, క్వాలిటీ కంట్రోల్) కె. ఆదిశేషయ్య, తిరుపతి సర్కిల్ కు జనరల్ మేనేజర్ (ఐటి, శాప్) సి. హెచ్. రామచంద్ర రావు, కడప సర్కిల్ కు జనరల్ మేనేజర్ (క్వాలిటీ కంట్రోల్) పి. మురళి, కర్నూల్ సర్కిల్ కు జనరల్ మేనేజర్ (కమర్షియల్) ఎస్.కె. ఇస్మాయిల్ అహమ్మద్ లను నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు.

ఈ విషయాన్ని తెలియచేసిన సదరన్ డిస్కం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడం కోసం అధికారులు/సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అందుబాటులో వుండాలని ఆదేశించారు. వర్షం కురుస్తున్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్ స్తంభాలను తాకవద్దని, లైన్ల కింద నిల్చోవద్దని సూచించారు.

ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలి పోవడం, లైన్లు తెగిపడడం లాంటి సంఘటనలను గుర్తించినట్లయితే తక్షణమే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు/సిబ్బందికి గానీ లేదా టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా సంస్థ వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement