Friday, September 20, 2024

AP: ఏలేరు వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ఉండండి… పవన్

వాళ్ల‌లో మ‌నో ధైర్యం కల్పించండి
ఆహారం, నీరు, పాలు క్ర‌మం త‌ప్ప‌కుండా ఇవ్వండి
రైత‌న్న‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి..


అమ‌రావ‌తి – ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్‌ తో పాటు ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకొని ఏలేరు వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడి ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని కోరారు. ఏలేరు వరదతో పంటలు కోల్పోయిన రైతులతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాట్లాడుతూ ధైర్యం చెప్పాలని సూచించారు.

ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఇవాళ ఉదయం ఫోన్ ద్వారా వరద పరిస్థితిపై చర్చించారు పవన్‌ కల్యాణ్‌.. ఎగువన కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా 62వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

గండ్లు పడటం, రహదారులపైకి నీటి ప్రవాహం చేరటం వల్ల పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పిఠాపురం – రాపర్తి, పెద్దాపురం – గుడివాడ, సామర్లకోట – పిఠాపురం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయని వివరించారు. గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు తెలిపారు. వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని వివరించారు.

ఇక, ఏలేరుకి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని డిప్యూటీ సీఎంకు వివరించారు కలెక్టర్. ఇవాళ ఉదయం 8గంటలకి 12,567 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోకి వచ్చేసిందని తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.16 టీఎంసీలుగా ఉందని వివరించారు. నాలుగు గేట్లు ఎత్తినట్లు చెప్పారు. కాగా, నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడి ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని ఆదేశించారు. ఏలేరు వరదతో పంటలు కోల్పోయిన రైతులతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాట్లాడుతూ ధైర్యం చెప్పాలని అధికారుల‌ను కోరారు ప‌వ‌న్.

Advertisement

తాజా వార్తలు

Advertisement