Saturday, September 28, 2024

Special Story – మావోళ్లుఏడున్నరో? ఆత్మీయుల జాడ‌కోసం జల్లెడ

గల్లంతైన వారు ఏడున్నారో
బతికే ఉన్నారా? లేదా?
అచ్యుతాపురం సెజ్ బాధితుల గుండె ఘోష
కేజీహెచ్ మార్చురీలో ఆత్మీయుల కోసం వెతుకులాట
ఆస్పత్రుల్లో క్షతగాత్రుల కోసం అన్వేషణ
జాబితాలో పేర్లున్నా ఎక్క‌డా ఆచూకీ లేదు
కంపెనీ ఎదుట కుటుంబీకుల ఆర్తనాదాలు
వివ‌రాలు వెల్ల‌డించని అధికారులు

ఆంధ్రప్రభ స్మార్ట్, : అచ్యుతాపురం సెజ్​లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన అతి భారీ పేలుడు ఘటనతో 17 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. కాగా, గాయపడ్డ వారిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక.. చనిపోయిన వారి మృతదేహాల కోసం బాధిత కుటుంబ సభ్యులు వెతుకులాడుతున్న తీరు అందరినీ కంటనీరు పెట్టిస్తోంది. ఆస్పత్రులకు తరలించామని కేజీహెచ్ సిబ్బంది చెబుతుంటే.. మృతదేహాలు ఎక్కడా కనిపించకపోయే సరికి తమ నాన్న, అన్న. బావ బతికే ఉన్నాడేమోనని ఇంటిల్లిపాది ఆశతో జల్లెడ పడుతున్నారు. విశాఖ కేజీహెచ్​లో హృదయవిదారక దృశ్యాన్ని సభ్య సమాజం తట్టుకోలేక పోతోంది. అచ్యుతాపురం సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’లో బుధవారం మధ్యాహ్నం జరిగిన భారీ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఎవరు చనిపోయారో? ఎవరు గాయపడ్డారో? అధికారులు విడుదల చేసిన జాబితాలో ఉంది. కానీ.. క్షతగాత్రుల జాడ మాత్రం ఆస్పత్రుల్లో కనిపించడం లేదు. మృతదేహాల ఆచూకీ లేదు. ఫలితంగా ఆయా కుటుంబాల గుండె ఘోష.. విశాఖ సముద్ర హోరును మించిపోయింది. వీరిలో కొందరి కన్నీటి వేదన ఇది.

- Advertisement -

ఆస్ప‌త్రుల చుట్టూ చ‌క్క‌ర్లు.. క‌న్నీటి రోద‌న‌..

అచ్యుతాపురం సెజ్ ఘోర కలిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబీకులు గుండెపగిలేలా రోదిస్తున్నారు. కంపెనీ గేటు వద్దనే కూర్చొని హృదయ విదారకంగా విలపిస్తున్నారు. కనీసం తమ ఆత్మీయుల మృతదేహాలను చూపించాలంటూ అల్లాడిపోతున్నారు. ఏదైనా సమాచారం తెలుస్తుందనే ఆశతో కంపెనీ వద్దకు చేరిన బాధితుల కుటుంబ సభ్యుల ఆక్రోశం చెప్ప‌న‌ల‌వికాకుండా ఉంది. మావాళ్లు అసలు బతికే ఉన్నారా? లేక చనిపోయారా? లేదా ఏదైనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా? ఏ ఆసుపత్రికి తరలించారో చెప్పాలని, మృతదేహాల్ని తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.. చిన్నారావు సతీమణి లోవమ్మ

‘‘నిన్న ఉదయం లంచ్ బాక్స్ కట్టాను. బాక్స్ తీసుకుని వెళ్లాడు. మధ్నాహ్నం రెండున్నరకు ప్రమాదం జరిగిందని తెలిసింది. ఇక్కడికి వచ్చాం. ఆయనను ఆంబులెన్స్ లో తీసుకెళ్లిపోయారు. ఇప్పటివరకు జాడ లేదు, ఆచూకీ లేదు. మనిషి గురించి ఏమీ తెలియట్లేదు. ఏం జరిగిందో తెలియక నేనూ, పిల్లలు కుమిలిపోతున్నాం. అని ఆరేళ్లుగా పెయింటర్ గా పనిచేస్తున్న చిన్నారావు భార్య లోవమ్మ అల్లాడిపోయింది. ప్రమాదం జరిగినట్లుగా కంపెనీ వాళ్లు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏమీ చెప్పలేదు. నేను చాలా మందికి ఫోన్ చేశాను. ఎవరూ ఫోన్ ఎత్తలేదు. మా బావ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తారు. ఆయనకు ఫోన్ చేసి అడిగితే, ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయనను ఇప్పటివరకు మేమెవ్వరం చూడలేదు. అంటూ లోవమ్మ క‌న్నీరుపెట్టుకుంది..

మా బావ బతికున్నాడో, లేదో.. వేగి సన్యాసిరావు మరదలు దేవీ

తమ వారి గురించి ఏమైందో తెలియక, వారి గురించి ఎవర్నీ అడగాలో తెలియక బాధితుల కుటుంబ సభ్యులంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో వేగి సన్యాసిరావు కూడా చనిపోయారు. ఆయన కోసం కుటుంబసభ్యులంతా వెతుకుతున్నారు. ‘‘ఇంకా ఏమీ తెలియలేదు, చనిపోయారని మేం అనుకుంటున్నాం. మా బావ సన్యాసిరావును గుర్తించడం కోసం మావాళ్లు కేజీహెచ్‌కు వెళ్లారు. ఆయన చనిపోయారా? లేదా? అనేది కూడా ఇంకా తెలియలేదు. కేజీహెచ్‌లో మృతదేహాలు ఉన్నాయని తెలిసి మా వాళ్లు అక్కడికి వెళ్లారు. లోపల ఉన్నారేమో అని మేం ఇక్కడికి వచ్చాం. మృతదేహాలన్నింటినీ ఆసుపత్రులకు పంపించేశామని చెబుతున్నారు. మేం చాలా ఆసుపత్రులు తిరిగాం. ఏ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నవారిలో మా బావ పేరు లేదు’’ అని సన్యాసిరావు మరదలు దేవి వివరించారు.

జాబితాలో నాన్న పేరుంది, కానీ బాడీ కనపడటం లేదు.. సన్యాసిరావు కుమార్తె వాసంతి

ప్రమాదం జరిగిందని మాత్రమే మాకు చెప్పారు. మా నాన్న ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారనే వివరాలేమీ మాకు ఎవరూ చెప్పలేదు. ఏ ఆసుపత్రికెళ్లినా మా నాన్న కనిపించలేదు. చనిపోయిన వారి జాబితాలో మా నాన్న పేరుంది. కానీ, ఆయన బాడీని మాకు చూపించలేదు. ఆయనకు ఏమైందో తెలియదు. ఎవరినైనా అడుగుదామంటే మా దగ్గరకు ఎవరూ రాలేదు. ఏమీ తెలియట్లేదు. ఎవర్నీ అడగాలో కూడా మాకు తెలియదు. నిన్నటి నుంచి ఇలాగే ఏడుస్తూ కూర్చున్నాం.. అని సన్యాసిరావు కూతురు వాసంతి విలపించారు.

అన్నయ్యను కడసారి చూడలేకపోయా.. టెక్నిషియన్ వెంకటసాయి చెల్లెలు కిరణ్మయి

రాఖీ కట్టడానికి ఎంతో దూరం నుంచి వచ్చాను. ఆ రోజురాత్రి 9.30గంటలైపోయింది. దీంతో రాఖీ కట్టాకా నీరసంగా ఉందంటూ పడుకున్నాడు. మరుచటి రోజు ఆఫీసుకు వెళ్ళిపోయాడు.రాత్రి ఆఫీసు నుంచి వచ్చాక కూడా ఎక్కువ ఏమీ మాట్లాడలేదు.తరువాత నిద్రపోయాడు.నేను ఉదయం 8గంటలకు నిద్రలేచే సరికే మా అన్నయ్య ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఒకసారి మొహం కూడా చూడలేదు. ఎవరి నుంచి ఎటువంటి అధికారిక సమాచారమూ లేదు. వీళ్ళు, వాళ్ళు చెప్పడమే తప్ప మా అన్నయ్య ఏమయ్యాడనే విషయం మాకు యాజమాన్యం నుంచి తెలియలేదు. ఎన్ని ఫోన్ కాల్స్ చేసినా స్పందించలేదు.’’ అని టెక్నిషియన్ వెంకటసాయి చెల్లి కిరణ్మయి కన్నీరు పెట్టుకున్నారు. ఇక తన కొడుకును చూడకుండా ఇంటికి వెళ్ళను అని వెంకటసాయి తల్లి గుండెలవిసెలా రోదిస్తున్నారు. దేవుడు మాకు ఎంత అన్యాయం చేశాడు. నిన్నటి నుంచే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టాం ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది అని ఆమె భోరుమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement