Monday, October 7, 2024

AP | తీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి…

ఏపీ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టిపెట్టారు. తీర ప్రాంతంలో అలల ఉద్ధృతికి భూమి కోతను నివారించేలా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రిసెర్చ్‌(ఎన్‌సీసీఆర్‌), ఏపీ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్‌ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది.

మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి తన నివాసంలో శుక్రవారం తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికను విడుదల చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టర్ రీసెర్చ్ (ఎన్.సి.సి.ఆర్.) నిపుణులు ఈ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక తీర ప్రాంతాల కోత, కెరటాల శక్తి తగ్గింపుతో పాటు కోత, కెరటాల తీవ్రత నుంచి వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకూ ఉపయోగపడుతుందని ఎన్.సి.సి.ఆర్. నిపుణులు తెలిపారు. కొత్త ఓడ రేవులు, ఫిషింగ్ హార్బర్లు లాంటి వాటి కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి 973 కి.మీ.కిపైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరం… తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత అనే ఆందోళన కలిగిస్తోందని, కోత ప్రమాదాన్ని నివారించేoదుకు ప్రత్యేక దృష్టిపెడుతున్నామన్నారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామనీ, రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు.

ఈ సమావేశంలో పీసీబీ సభ్య కార్యదర్శి శ్రీ బి.శ్రీధర్, అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీ శరవణన్, డా.పి.వి.చలపతిరావు, ఎన్.సి.సి.ఆర్. శాస్త్రవేత్తలు డా.ఎం.వి.రమణమూర్తి, శ్రీ వి.రామనాథన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement