Sunday, September 22, 2024

AP | ఉక్కు కార్మికులపై మరో పిడుగు.. !

విశాఖపట్నం, (ప్రభన్యూస్) : మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా.. అసలే జీతాలు సమయానికి రాక నానా ఇబ్బందులు పడుతున్న విశాఖ ఉక్కు ఉద్యోగులపై ఉక్కు యాజమాన్యం (శనివారం) సాయంత్రం విడుదల చేసిన ఉత్తర్వులు మరో పిడుగు లా పడ్డాయి.

విశాఖ‌ స్టీల్ యాజమాన్యం (శనివారం) సాయంత్రం హెచ్‌ఆర్ పాలసీ సర్క్యులర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, క్లిష్ట ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రస్తుతానికి కొన్ని ఆర్థిక సౌకర్యాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

2024లో పదవీ విరమణ పొందే ఎల్‌టిసి, ఎల్‌ఎల్‌టిసి, ఎల్‌టిఎ ఉద్యోగులతో సహా నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు సంబంధించి ఎల్‌టిసి, ఎల్‌ఎల్‌టిసి, ఎల్‌టిఎ, ఉద్యోగులందరికీ ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ) చెల్లింపు వాయిదా…. బోర్డు లెవెల్ ఎగ్జిక్యూటివ్‌లకు 12 శాతం, దిగువ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు 6 శాతం పెర్క్విసైట్‌లు, అలవెన్సులు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీంతో ఉక్కు కార్మికులు ప్రస్తుతం ఈ ఉత్తర్వులపై చర్చిస్తూ ఆందోళనకు గురవుతున్నారు. హెచ్‌ఆర్‌ఏ ఇవ్వకపోవడంతో ప్రతి నెలా దాదాపు రూ.7 కోట్ల ఆదా అవుతుందని యాజమాన్యం చెప్పడంతో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఇలాంటి సర్క్యులర్‌ జారీ చేశార‌ని.. విశాఖ ఉక్కును కచ్చితంగా ప్రైవేటీకరించాలనే దురుద్దేశంతో ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదంతా చేస్తోందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement