Wednesday, October 23, 2024

Shock To YSRCP – వాసిరెడ్డి ప‌ద్మ కూడా జ‌గ‌న్ కు టాటా..

విజ‌య‌వాడ – వైసిపి కీల‌క నేత‌, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఈ మేర‌కు ఆమె నేడు ఆ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ కు త‌న రాజీనామా లేఖ‌ను పంపారు.. అలాగే ఆమె నేడు త‌న రాజీనామాపై విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో కష్టపడిన వారికోసం జగన్‌ ఇప్పుడు గుడ్‌బుక్‌, ప్రమోషన్లు అని అంటున్నారని చెప్పారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్‌బుక్ కాద‌ని.. గుండె బుక్‌ అని స్పష్టం చేశారు. వారికి ప్రమోషన్లు అనే పదం వాడటానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదు అని అన్నారు.

ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే జగన్ తాజాగా గుడ్‌బుక్‌ పేరుతో మరోసారి మోసంచేయడానికి సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. జగన్‌కు పార్టీని నడిపించడంలో బాధ్యత లేదని పరిపాలన చేయడంలో బాధ్యత లేదని దుయ్య‌బ‌ట్టారు.. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని వాసిరెడ్డి విమర్శించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని గత ఎన్నికల తీర్పు స్పష్టంచేసిందని అన్నారు. వ్యక్తిగతంగా విధానాల పరంగా అనేక సందర్బాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశానని తెలిపారు. ప్రజా తీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

అస‌లు కార‌ణం అదేనా …

- Advertisement -

ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్యే సీటు ఆశించారు. తనకు కానీ తన భర్తకు కానీ ఆ టికెట్‌ కేటాయించాని జగన్‌ను పద్మ కోరారు. కానీ పార్టీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఎమ్మెల్యే టికెట్‌ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేసినప్పటికీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని అప్పట్లో ఆమె స్పష్టం చేశారు.అప్పటివరకు యాక్టివ్‌గా ఉంటూ వైసీపీ తరఫున గొంతు వినిపించిన ఆమె సైలెంట్‌ అయ్యారు.

ఇక జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇటీవ‌ల వైసీపీని వీడారు. దీంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను తనకే ఇస్తారని వాసిరెడ్డి పద్మ భావించారు. కానీ తన్నీరు నాగేశ్వరరావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తితో తనకు పార్టీలో సరైన గుర్తింపు లభించట్లేదని భావించి వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె రాజీనామా చేసినట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement