Sunday, September 8, 2024

Press Meet – చంద్రబాబు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది జ‌గ‌న్

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – కేవలం 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని చెప్పారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశపెట్టలేక పోతోందని ఎద్దేవా చేశారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందని అన్నారు.

ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి స్పష్టంగా కనిపిస్తోందని జగన్ చెప్పారు. అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారంటే… పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న “భయం’’, ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు, అమలు చేయని పరిస్థితిలో… ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న ‘‘భయం’’ అని అన్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదు అన్న పరిస్థితి సృష్టిస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయని… ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షమని చెప్పారు. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉందని, ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలని చెప్పారు. ఆ పార్టీ నాయకుడినే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కానీ, ఆ పని చేస్తే.. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయమని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్‌ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదని విమర్శించారు.

ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా, చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నారని అన్నారు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, చంద్రబాబునాయుడి పాపాలు కూడా పండే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. తనతో పాటు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని.. 24వ తేదీన, అక్కడ ఫోటో గ్యాలరీ, నిరసన కార్యక్రమం ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంతో, మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement