Friday, September 27, 2024

Political comeback | జ‌న‌సేన సూప‌ర్ విక్ట‌రీ….

  • పోటీ చేసిన 2 లోక్ సభ, 21 ఎసెంబ్లీ సీట్ల‌లో ఘ‌న విజ‌యం
  • వంద శాతం విజ‌యంతో పార్టీలో స‌రికొత్త జోష్
  • ప‌దేళ్ల జ‌న‌సేనాని ప్ర‌స్థానానికి గోల్డెన్ గిప్ట్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యా నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్నిచోట్లా ఆ పార్టీ విజయం సాధించింది. పదేళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతేడాది కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం గెలుపొందిన ఆ పార్టీ.. ఈసారి ఏకంగా పోటీ చేసిన 2 లోక్ సభ, 21 ఎసెంబ్లీ సీట్ల‌లో స్థానాల్లోనూ విజయం సాధించింది. తోక పార్టీ అంటూ విమర్శలు చేసిన వారికి ఈ విజయంతో గట్టి బదులిచ్చింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదటినుంచీ చెప్తూ వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కీలక సమయంలో టిడిపి తో పొత్తు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు సమయంలో ఆయన 24 స్థానాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించారు. తర్వాత మూడు స్థానాలు మిత్రపక్షాలకు విడిచిపెట్టారు. దీంతో కొందరు ‘సీనియర్‌’ నేతలు పవన్‌కు ‘ఉచిత’ సలహాలు ఇచ్చారు. ఆయనకు లేఖాస్త్రాలు సంధించారు. కానీ, వారి ‘పల్లకి మోత’లకు ఎక్కడా పవన్‌ కల్యాణ్‌ తలొగ్గలేదు. వారికి సమాధానం కూడా ఇచ్చిందే లేదు. తన పనిని చేసుకుంటూ పోయారు. 21 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందరినీ ఒంటిచేత్తో గెలిపించుకోగలిగారు.

98 శాతం కాదు.. 100 శాతం

”గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నాం. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించాం. 98 శాతం స్ట్రైక్‌ రేటు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశాం. 60, 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేది” అని ఎన్నికల ముందు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఎలాంటి పొరపొచ్చాలు వచ్చినా అవన్నీ దాటుకుని తెదేపా- జనసేన గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన చెప్పినట్లే ఆ పార్టీ అభ్యర్థులు 21 స్థానాల్లో విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement