Sunday, September 15, 2024

Pithapuram : ఆడపడుచులకు పవన్ గిఫ్ట్… పసుపు, కుంకుమ, చీరలు అంద‌జేత

పిఠాపురం : శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక శాసనసభ్యులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు, కుంకుమ, చీరలు అందజేశారు. పవన్ కళ్యాణ్ తరఫున ఆయన వదిన, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ, శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీరలు కానుకగా అందజేశారు.

పద్మజ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, బొట్టు పెట్టి మరీ సారె అందచేశారు. అనంతరం సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాలు ప్రారంభించారు. పిఠాపురం ఆడపడుచులతో కలిసి పద్మజ వరలక్ష్మీ వ్రతం ఆచరించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణలతో ఘనంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే పురూహూతిక అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. వందాలాదిగా తరలివచ్చి భక్తి శ్రద్దలతో వ్రతమాచరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూడు బ్యాచ్ లు గా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి భవాని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

- Advertisement -

పురూహూతిక అమ్మవారి ఆశీస్సులు…
అంతకు ముందు పద్మజ పురూహూతిక అమ్మవారిని, శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయంలో తలపెట్టిన సామూహిక వరలక్ష్మి వ్రత పూజలకు అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు. వ్రతమాచరించే ఆడపడుచులందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement