Thursday, September 19, 2024

Rains | ఏపీ, తెలంగాణ‌కు మ‌రో వాన‌గండం !

గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాలపై మరో బాంబ్ పడనుంది. తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని ఐఎండీ వెల్లడించింది. రానున్న 24గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుందని ఐఎండీ పేర్కొంద. దీని ప్రభావం ఏపీ, తెలంగాణతోపాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ అధికారులు అంటున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈనెల 20వ తేదీ నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ వర్షాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఈరోజు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్తాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అటు ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ధ్రోణి కొనసాగుతుందటంతోపాటు ఈ సీజన్ లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కోస్తాంధ్రలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement