Tuesday, October 22, 2024

AP : మద్యం మత్తులో స్నేహితుడి హత్య

నిందితుడు ఆదిత్య పార్మసీ యజమాని
(ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో) : మద్యం మత్తు సృష్టించిన క్షణికావేశంలో.. తన చిన్ననాటి స్నేహితుడిని హతమార్చి ఓ ఫార్మసీ కంపెనీ యజమాని కన్నీరు మున్నీరయ్యాడు. తానే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ హత్య విజయవాడలో సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఆదిత్య ఫార్మసీ యజమాని వెంకట నర్సింహరాజు, విజయవాడ యనమలకుదురుకు చెందిన మహ్మద్ రఫీ చిన్ననాటి స్నేహితులు. నర్సింహ రాజుకు అయోద్యనగర్ లోటస్ సెక్టర్-1 పృథ్వీ అపార్ట్ మెంట్ లో ఓ ప్లాట్ ఉంది.

సోమవారం రాత్రి ఇద్దరు స్నేహితులు మద్యం సేవించారు. మద్యం మత్తులో మాట మాట పెరగడంతో వెంకట నర్సింహ రాజును కత్తెరతో రఫీ పొడిచి చంపబోయాడు. రాజు తప్పించుకుని తన టవల్ తో రఫీ మెడకు వేసి నులిమాడు. దీంతో రఫీ మృతిచెందాడు. ఘటనపై పోలీసులకు నర్సింహ‌ రాజు ఫోన్ చేశాడు. తన స్నేహితుడు చావుకు తానే కారణమయ్యానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. రఫీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

అసలు వీరిద్దరి మధ్య ఘర్షణకు కారణమేంటీ ? నిజంగా రఫీ దాడిచేస్తే తప్పించుకునే ప్రయత్నంలో రఫీని రాజు హత్య చేశాడా ? లేక ప్రీప్లాన్ గా చంపేసి.. తనపై దాడి కథను రాజు అల్లుతున్నాడా ? అనే కోణంలో సత్యనారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడు ఓ ప్రముఖ కంపెనీ అధినేత కావడంతో.. ఈ హత్యోదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement