Thursday, October 24, 2024

KNL | వాహ‌న‌దారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి… ఎస్పీ బిందు మాధవ్

భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో నిర్వీర్యం
110 బైక్ సైలెన్సర్లు ధ్వంసం
స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సైలెన్సర్ల ను సీజ్ చేసిన కర్నూలు పోలీసులు
ట్రాఫిక్ సమస్యల పై దృష్టి సారిస్తాం


కర్నూలు బ్యూరో : ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని క‌ర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అన్నారు. కర్నూలు పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం కొండారెడ్డి బురుజు దగ్గర అధిక శబ్దం కలిగించే 110 సైలెన్సర్స్ లను గురువారం కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ రోడ్డు రోలర్ తో నిర్వీర్యం చేయించారు. ఎవరైనా మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు పట్టణంలో గత 4 రోజుల్లో కర్నూలు ట్రాఫిక్ పోలీసులు 60 సైలెన్సర్లు, కర్నూలు పట్టణ పోలీసులు 50 సైలెన్సర్లను సీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా ఎస్పీ మీడియా తో మాట్లాడుతూ…. కర్నూలు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్లను అమర్చుకొని 80 డెసిబల్స్ కంటే అధిక శబ్దం చేస్తున్న బైక్ లను సైంటిఫిక్ పద్దతిలో నాయిస్ పొల్యూషన్ సామాగ్రిని ఉపయోగించి పట్టుకున్నామన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతమైన ఆ వాహన దారులకు జరిమానాలు విధించడం, వారి వాహనాలు సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం వంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

కర్నూలు వెంకటరమణ కాలనీ, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వృద్దులను, రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ అధిక శబ్దం చేసే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ప్రజలకు, తోటి వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ ధ్వని కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అధిక శబ్దం చేసే సైలెన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా కౌన్సిలింగ్ చేస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ సీఐలు మన్సురుద్దీన్, నాగరాజారావు, రామయ్య నాయుడు, మురళీధర్ రెడ్డి, ట్రాఫిక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement