అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంలోనే అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజాధరణ పొందిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికు మరింత భద్రతను కల్పించే ప్రక్రియలో భాగంగా కొత్తగా మరో రెండు హెలీకాఫ్టర్లను లీజు ప్రాతిపదికన సమకూర్చారు. ఈ మేరకు అందుకు సంబంధించి ఒప్పంద ప్రక్రియను కూడా చేపట్టారు. ప్రస్తుతం ఉన్న హెలీకాఫ్టర్ 2010 నుంచి రాష్ట్ర పర్యటనలకు ఉపయోగిస్తున్నారు.
అయితే ఆయన భద్రత అంశాల దృష్ట్యా మరో రెండు హెలీకాఫ్టర్లను లీజు ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని ఇంటెలిజెన్స్ పేర్కొంది. దీంతో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్. యువరాజు సీఎం జగన్కు రెండు కొత్త హెలీకాఫ్టర్లను లీజు ప్రాతిపదికన సమకూర్చుకోవాలని గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం సీఎం కోసం రెండు హెలీకాప్టర్లు సిద్ధం చేస్తోంది..
సీఎం జగన్ పర్యటనల నిమిత్తం రెండు ప్రత్యేక హెలీకాప్టర్లను రెడీ చేస్తున్నారు.. విజయవాడ, విశాఖల్లో రెండు హెలీకాప్టర్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెస్సర్స్ గ్లోబర్ వెక్ట్రా హెలికాప్టర్స్ అనే సంస్థ నుంచి హెలీకాప్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం లీజుకు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రెండు ఇంజిన్లు కలిగిన భెల్ సంస్థ తయారు చేసిన హెలికాప్టర్లను లీజుకు తీసుకునేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఒక్కోహెలికాప్టర్కు నెలకు రూ.1.91 కోట్ల చొప్పున ఈ మేరకు లీజు చెల్లించనున్నారు.
ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మరింత భద్రత..
రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విస్తృతంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వారంలో రెండు, మూడు జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మార్చి మొదటి వారం తర్వాత నిరంతరం ఆయన జిల్లాల పర్యటనల్లోనే ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం భద్రతపై ఇంటెలిజెన్స్ వర్గాలు మరింత కట్టుదిట్టమైన భద్రతను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే లీజు ప్రాతిపదికన రెండు హెలీకాఫ్టర్లను సమకూర్చారు. సీఎం జగన్ పర్యటించే ప్రాంతాల్లో కూడా ఇక భద్రత మరింత కట్టుదిట్టం చేయనున్నారు.