Friday, September 20, 2024

AP: ఒక్కొక్కటిగా వెలుగులోకి వైసీపీ అరాచకాలు.. బుద్దా వెంక‌న్న

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. అప్పట్లో గంట, అరగంట మంత్రుల వ్యవహారం, మొన్న సాయిరెడ్డి శాంతిల అంశం, ఇప్పుడు సకల శాఖామంత్రి అరాచకం ఇలా ఐదేళ్లలో అడ్డూ, అదుపు లేకుండా వైసిపి నేతలు చెలరేగి, అమాయక మహిళల జీవితాలతో ఆటలాడుకున్నారని విమర్శించారు. జగన్ హయాంలో ఎవ్వరికీ రక్షణ లేదన్న ఆయన జరిగిన వాటన్నిటికీ కర్త, కర్మ, క్రియ సజ్జలేనని ఘాటుగా ఆరోపించారు.

విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు సినీ నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమ‌న్నారు. విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశాం అన్న ఆయన, గంట, అరగంట మంత్రులు ఏమన్నారో రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామ‌న్నారు. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ ఇన్నీ కావన్న ఆయన ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారన్నారు.

ఇప్పుడు నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగించే అంశం అన్నారు. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే, ఐపీఎస్ లు పరుగులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఛీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం అయినప్పటికీ మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారని, ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాద్ రెడ్డి, కాంతి రాణా టాటాలను వెంటనే అదుపులోకి తీసుకోవాలన్నారు.

- Advertisement -

ఈ కేసుల్లో పాత్రధారులు, సూత్రధారులను త్వరితగతిన ప్రాసిక్యూట్ చేయాలన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్న ఆయన చివరకు ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహరించడం దారుణమన్నారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement