Monday, October 7, 2024

AP | కనకదుర్గమ్మకు తెలంగాణా నుంచి బంగారు బోనం..

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆషాడ సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు బంగారు బోనాన్ని సమర్పించారు.

ఆషాడ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే (గత 15 సంవత్సరాలుగా) ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, కమిటీ సభ్యులు అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించేందుకు రాగా…. వారికి బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు ఘన స్వాగతం పలికారు.

అనంతరం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నందలి దేవతామూర్తుల వద్ద వీరు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు తెలంగాణా బొనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమమును ప్రారంభించారు.

అనంతరం తెలంగాణా బోనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు జమ్మిదొడ్డి నుంచి పోతురాజుల విన్యాసాలు, వివిధ కళాకారుల వేషధారణలు, నృత్యాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలుతో సుమారు 1000 మంది పైగా ఊరేగింపుగా బయలుదేరి… రధం సెంటరు, ఘాట్ రోడ్డు మీదుగా శ్రీ అమ్మవారికి సమర్పించే బంగారు భోనం తలపై ఉంచుకుని దుర్గా ఘాట్ వద్ద కృష్ణ నది గంగ తెప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ అమ్మవారి ఆలయానికి కాలినడకన చేరుకున్నారు.

అనంతరం తెలంగాణ బొనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకొని, పూజలు నిర్వహించి అమ్మవారికి బంగారు భోనం సమర్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వాహణాధికారి కే.ఎస్.రామారావు వీరికి అమ్మవారి శేషవస్త్రములు, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు, సభ్యులు, ఆలయ వైదిక సిబ్బంది, సహాయ కార్యనిర్వహణాధికారులు పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement