Friday, September 20, 2024

AP: వరలక్ష్మి దేవిగా కనకదుర్గమ్మ…

శ్రావణ శోభతో కలకలలాడుతున్న ఇంద్రకీలాద్రి..
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..
అమ్మ ఆశీస్సుల కోసం తరలివస్తున్న భక్తులు..
లక్ష కుంకుమార్చన లో విశేషంగా పాల్గొన్న వైనం..
అమ్మవారికి భక్తిగా పసుపు, కుంకుమ సమర్పణ..
ముత్తయిదువులకు వాయినాలు…
(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : అమ్మలగన్న అమ్మ ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు వరలక్ష్మిదేవి అలంకరణలో దర్శనమిస్తోంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మను శ్రావణ శుక్రవారం రోజు దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కనకదుర్గమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున అమ్మవారికి మహిళలు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, ముత్తైదువులకు వాయినాలను అందిస్తున్నారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం రోజున కనకదుర్గమ్మకు ఆర్జిత పూజలైన ఖడ్గమాలార్చన చండీహోమం, లక్ష కుంకుమార్చనతో పాటు వివిధ రకాల పూజలు నిర్వహించేందుకు తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుంది.

తెల్లవారుజాము నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందుకునేందుకు ఉభయ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వస్తుండడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం శ్రావణ శోభ సంతరించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement