Friday, September 20, 2024

AP | ఎయిర్ జర్నీ.. విజయవాడ – ఢిల్లీ మరింత ఈజీ !

ఆంధ్రప్రదేశ్‌ వాసులకు కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశ రాజధాని నుంచి ఏపీ రాష్ట్ర రాజధానికి మధ్య అనుసంధానం మరింత పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతి రోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

ఏపీ వాసులతో ఆసక్తికర విషయాన్ని పంచుకోవడానికి తాను సంతోషిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రతినిత్యం ఇండిగో విమానం ఢిల్లీకి రాకపోకలు సాగించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఎక్స్‌ వేదికగా తెలిపారు.

విజయవాడ – ఢిల్లీ మధ్య ఇండిగో సంస్థ రోజు విమాన సర్వీసులను ప్రారంభిస్తుందనే ప్రకటన చేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా అని తెలిపారు. సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి విజయవాడ – ఢిల్లీకి రాకపోకలు ప్రారంభించనున్నారు. ఈ విమానాల అనుసంధానంతో ఢిల్లీ-అమరావతి మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇది సాధ్యం చేసిన వారందరికీ కృతజ్ఞతలు అని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా విమాన రాకపోకల సమయాన్ని వెల్లడించారు. విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరు సమయం ఉదయం 11.10 గంటలకు కాగా.. ఢిల్లీకి మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకోనుంది. ఇక ఢిల్లీ నుంచి విజయవాడకు రాత్రి 08.10 గంటలకు బయలు దేరి విజయవాడకు రాత్రి 10.40 గంటలకు చేరుకోనుంది.

కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక ప్రయోజనాలు అందుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌లో అగ్రతాంబూలం లభించగా.. ఇక విమాన సేవల పరంగా భారీ ప్రయోజనం చేకూరుతోంది. పౌర విమానయాన శాఖ రామ్మోహన్‌ నాయుడు వద్ద ఉండడంతో ఆయన సాధ్యమైనంత స్వరాష్ట్రాన్రికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

- Advertisement -

ఈ క్రమంలోనే ఇటీవల కడప విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రతినిత్యం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు విజయవాడకు ఇండిగో విమానం అందుబాటులోకి రాగా మరిన్ని విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీలో విమాన సేవలను మరింత పెంచే యోచనలో రామ్మోహన్‌ నాయుడు ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement