Wednesday, October 23, 2024

Guntur – శ్రీ చైతన్య లో మరణ ఘోష – ఎనిమిదో తరగతి విద్యార్థిని బలవన్మరణం

ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో: కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్య లో మరోసారి మరణ ఘోష వినిపించింది. గతంలో పలువురు విద్యార్థులు యాజమాన్య వేధింపులకు బలయ్యారు. తాజాగా రెడ్డిపాలెంశ్రీ చైతన్య టెక్నో క్యాంపస్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న చిలకలూరిపేటకు చెందిన కరణం పద్మ సుధ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

అయితే స్కూలులోనే మంగళవారం అర్ధ రాత్రి ఉరి వేసుకుని చనిపోయినట్లు యాజమాన్యం చెబుతున్నారు. సమాచారాన్ని చిలకలూరిపేట లోని తల్లిదండ్రులకు తెలియజేయడంతో హుటాహుటిన వారు శ్రీ చైతన్య క్యాంపస్ వద్దకు చేరుకున్నారు. విగత జీవిగా మారిన కుమార్తెను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పద్మసుధ మృతికి స్పష్టమైన కారణాలను యాజమాన్యం తెలియజేయకుండా డొంక తిరుగుడు వ్యవహారం నడుపుతోంది. కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా యాజమాన్యం ముఖం చాటేస్తుంది. అయితే అక్కడ చదువుతున్న విద్యార్థులు పలువురు పలు విధాలుగా మృతికి సంబంధించి చెబుతున్నారు. దీంతో అనుమానించిన కుటుంబ సభ్యులు, వారి శ్రేయోభిలాషులు, మీడియాను, పోలీసు వారి సహకారం కోరుతూ స్కూలు వద్ద నే బైఠాయించారు. అయితే కుటుంబ సభ్యులను మభ్య పెట్టేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుంది. కూటమి పార్టీకి చెందిన కొందరు నేతలు ఈ వ్యవహారంలో తలదూర్చి రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తె మరణం వెనుక వాస్తవాన్ని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement