Friday, September 20, 2024

AP: శోభాయమానంగా పవిత్ర సంగమం…

30నుంచి 45 రోజుల్లోగా కృష్ణమ్మకు నిత్య హారతులు
సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం
పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా పవిత్ర సంగమం
మంత్రులు రామనారాయణరెడ్డి, నారాయణ, పార్థసారథి
(ఇబ్రహీంపట్నం, ప్రభ న్యూస్) : పవిత్ర సంగమాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.‌ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతాన్ని మున్సిపల్ అండ్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, సమాచార అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారథితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసంద‌ర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ…. గతం కంటే మెరుగ్గా పవిత్ర సంఘం తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. 30నుంచి 45రోజుల్లోగా కృష్ణమ్మకు నిత్య హారతులను పునః ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా పవిత్ర సంగమాన్ని తయారు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏదైనా ఆలయం నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ఆలయ నిర్మాణానికి గతంలోనే చంద్రబాబు భూ సేకరణ చేయాలని చెప్పారన్నారు. ఎలాంటి ఆలయం నిర్మించాలో వైదికంగా, ఆధ్యాత్మికంగా, వైదిక శాస్త్రం ప్రకారం దేవదాయ శాఖ కమిషనర్ కు ఆదేశాలు ఇస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి ఆలోచనలతో కార్యరూపం దాల్చే విధంగా చూస్తామని చెప్పారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ… పవిత్ర సంగమాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అన్ని శాఖల సమన్వయంతో పూర్వ వైభవం వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ…. పవిత్ర సంగమం ఐకానిక్ ప్రాంతంగా మారబోతుందన్నారు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement