విశాఖపట్నం, పభన్యూస్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వం స్వార్ధపూరిత రాజకీయ కక్షలతో రాజధాని నిర్మాణాన్ని సర్వనాశనం చేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై మాట్లాడారు. అమాయకమైన రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూశారని అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఎలక్ట్రాన్రిక్ సిటీగా పేర్కొన్న ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉండి కనీస పరిజ్ఞానం లేకుండా ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నా మీ మూర్కత్వ ప్రయత్నాలను హైకోర్టు తప్పుపట్టి స్టే విధించి అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు.
నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు పేదల పక్షాన నిలిచి పట్టాలు ఇవ్వదల్చుకుంటే ఆర్5 జోన్ పరిధిలో లేని వాటిని ఇచ్చి మీ విశ్వసనీయత చాటుకోవాలని, అంతే కానీ పేదల సంక్షేమం ముసుగులో అమరావతి మాస్టర్ ప్లాన్ను ధ్వంసం చేయవద్దున్నారు. చట్టాలు మీకు చుట్టాలు కావనే సత్యాన్ని గ్రహించి ఇప్పటి-కై-నా నెత్తికెక్కిన మీ కళ్ళను కిందకు దించండి అంటూ పేర్కొన్నారు.