Friday, September 20, 2024

AP: అపోలో హెల్త్ వ‌ర్సిటీలో ఫుడ్ పాయిజ‌న్… 150మందికి అస్వ‌స్థ‌త

చిత్తూరు, ఆగస్టు 21 (ప్రభ న్యూస్ బ్యూరో): చిత్తూరు అపోలో మెడికల్ కళాశాలకు చెందిన 150మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.‌ వెంటనే కళాశాల యాజమాన్యం చికిత్స నిమిత్తం విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల తరలించారు. వివరాల్లోకెళితే.. చిత్తూరు నగరంలోని మురుకంబట్టులో ఉన్న అపోలో వైద్య కళాశాలలో నిన్న రాత్రి ఊతప్పం దోస, ఆలుగడ్డ కర్రీ పప్పును విద్యార్థులు తిన్నారు. అయితే బుధవారం ఉదయం కొంతమంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయింది.

ఒక్కసారిగా పదుల సంఖ్యలలో వాంతులు, విరోచనాలు కావడంతో కళాశాల యాజమాన్యం చికిత్స నిమిత్తం వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి ఉన్నతాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే చిత్తూరు టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య, తాలూకా ఎస్ఐ రమేష్, సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు సేకరించారు.

ఈసంద‌ర్భంగా అపోలో మెడికల్ కళాశాల యూనిట్ హెడ్ నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. బయట హోటల్లో ఆహారం తిన్నవారు అస్వస్థతకు గుర‌య్యార‌న్నారు. అందులో జ్వరం, వాంతులు విరేచనాలు అయిన వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. రాత్రి విద్యార్థులతో పాటు తాను కూడా హాస్టల్ లోనే భోజనం చేసినట్లు ఆయన తెలిపారు. అపోలో కళాశాల హాస్టల్ క్యాంటీన్ ఆహారంలో ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బయట తిన్న వారు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement