Sunday, September 8, 2024

Exclusive – నిన్న లక్షలలో… నేడు కోట్లలో …పిఠాపురంలో ‘రియల్ ‘ పరుగులు

ఎక‌రం రూ. 2 కోట్లు!
పిఠాపురంలో భూములు పిరం
ఇకమీదట ఇది రియల్ పురం
కాసుల పంట పండిస్తున్న భూమి
ధరలు మూడింతల దూకుడు
ఎకరం లక్షల్లో కాదు.. రెండు కోట్లు
భూమ్మీద ట్వింకిల్ ట్వింకిల్ స్టార్
ఆకాశంలో పవర్ స్టార్ మిల మిల
ఏపీ దృష్టి మొత్తం పిఠాపురంపైనే

ఆంధ్రప్రభ స్మార్ట్, పిఠాపురం ప్రతినిధి: పిఠాపురం సాధారణ నియోజకవర్గం. రాజకీయ శాసన స్థానంగా అవతరించింది. కానీ, రాష్ట్ర రాజధానికి కనుచూపు మేరలో లేదు.. రాష్ట్రంలో విశాఖపట్టణం, విజయవాడకు కారులో చేరాలంటే నాలుగు గంటల జర్నీ . ఉన్నది ఒకటే నగరం. అదే కాకినాడ రేవు. ఇది సరే . ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కాదు. ఏవో అంతర్జాతీయ సంస్థలు వస్తాయనే ప్రచారమూ లేదు. పూర్తిగా గ్రామీణ నేపథ్యం . ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద ఏపీగా మారింది. ఈ నియోజకవర్గంలో భూములకు ఒక్కసారి గిరాకీ పెరిగింది. ఎన్నికల ముందు వరకు ఉన్న ధరలు ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయాయి. ఎక్కడెక్కడి సంపన్నులు, మధ్యతరగతి .జీవులు ఈ పిఠాపరం భూముల కోసం ఎగబడుతున్నారు. ఇంతలా ఇక్కడి భూములకు డిమాండ్‌ ఎందుకు ఏర్పడింది? ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది..

- Advertisement -

నెల రోజుల్లోనే భూమ్.. భూమ్..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో పరిస్థితులు మారుతున్నాయా? గత ఐదేళ్లు నత్తనడకన సాగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గంపై ఓ లుక్కేయాల్సిందే. రాష్ట్రంలో రియల్‌ వ్యాపారం ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే, పిఠాపురంలో మాత్రం భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నెల రోజుల నుంచి పిఠాపురంలో రియల్‌ భూమ్‌తో పంట పొలాల ధరలు ఒక్కసారిగా రెండింతలయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంపై రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్‌ ఉండటం.. పిఠాపురం రూపురేఖలు మార్చేస్తారనే అంచనాలతో ఈ నియోజకవర్గంలో భూములపై పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు.

ధరలు మూడు రెట్లు దూకుడు ..

నెల రోజులుగా పిఠాపురంలో భూ వ్యవహారాలను గమనిస్తే ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలుస్తున్నాయి. ఒకప్పుడు ఒక‌రం భూమికి రూ. 50 నుంచి 60 లక్షలు ఉండేది. ప్ర‌స్తుతం ఈ భూముల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి. ఇలా ఒకేసారి ధరలు పెరగడానికి కారణం డిప్యూటీ సీఎం పవన్‌ కారణమని రియల్ బాబులు విశ్లేషిస్తున్నారు. గతంలో తమ ప్రాంతంలో ఈ స్థాయిలో రియల్‌ వ్యాపారం జరిగేది కాదని.. పవన్‌ గెలిచిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో స్థిరపడిన వారు సైతం భూముల కోసం తమకు ఫోన్లు చేస్తున్నారని చెబుతున్నారు.

పిఠాపురంలో రియల్ పంటే పంట..

నెల రోజులుగా మారిన పరిస్థితులతో పిఠాపురంలో భూములు ఉన్నవారి పంట పండుతోంది. రోజు రోజుకు ధరలు పెరిగిపోవడంతో అమ్ముదామని అనుకున్నవారు సైతం కొద్ది రోజులు వేచిచూద్దామనే ఆలోచనకు వచ్చేస్తున్నారు… ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో సొంత ఇల్లు, పార్టీ ఆఫీసు నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3.52 ఎకరాలు భూమి కొన్నారు. రెండు ఎకరాల్లో పార్టీ ఆఫీసు, ఆ పక్కనే తన సొంత ఇల్లు నిర్మిస్తానని ప్రకటించారు. ఇక ఆ మరునాడు నుంచి పవన్‌ భూమికొన్న పరిసరాల్లో స్థలాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో తరలివస్తున్న రియల్‌ వ్యాపారులు… బేరాలు కూడా లేకుండా రైతులు చెప్పిన ధరకు అగ్రిమెంట్లు చేసుకుంటామని ఆఫర్లు ఇస్తున్నారు…

ఎకరం ధర రూ.2 కోట్లు..

తాజా రియల్‌ భూమ్‌తో పిఠాపురం టౌన్‌లో రోడ్డు పక్కన ఎకరం 2 కోట్లు పలుకుతోంది. ఇంతకుముందు వరకు రూ. 50 లక్షల నుంచి కోటి 25 లక్షల రూపాయల మధ్య ఉండే ధర అమాంతంగా పెరగడంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే ఎకరం భూమి అమ్మాల్సి వచ్చేదని.. ఇప్పుడు సగం భూమి అమ్మినా గ్రాండ్‌గా పెళ్లి చేసేయొచ్చని సంబరపడుతున్నారు పిఠాపురం వాసులు. పవన్‌ నాయకత్వంపై నమ్మకం వల్ల భవిష్యత్‌లో పిఠాపురం అభివృద్ధి చెందే అవకాశం ఉందనే ఆలోచనే ఈ రియల్‌ భూమ్‌కి కారణంగా చెబుతున్నారు. ఒక్కసారిగా ఏర్పడిన డిమాండ్‌తో పిఠాపురం నుంచి చేబ్రోలు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా కొందామంటే భూములు దొరకని పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి పవన్‌ నాయకత్వంపై నమ్మకంతో పిఠాపురంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుండటమే హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement