Monday, September 16, 2024

Exclusive – వెలుగు నీడల స్వాతంత్య్రం! . . ఐక్య పోరాటాలతోనే తెగిన సంకెళ్లు

సర్వసత్తాక రాజ్యంగా భారత్​
బహుళత్వపు విలువలతో ముందుకు
కాలానికి అనుగుణంగా మార్పులు
వరల్డ్​లోనే అయిదో ఆర్థిక శక్తిగా ఎదుగుదల
కుల, మత, వర్ణ, వర్గాలకు అతీతంగా పోరాటాలు
సిఫాయిల తిరుగుబాటుతో మొదలైన పోరు
వందేమాతరం, సహాయ నిరాకరణ ఉద్యమాలు
క్విట్​ ఇండియాతో మరింత ఉధృతం
తెల్లదొరల పాలన నుంచి విముక్తం
ప్రజాస్వామ్య దేశంగా నిలదొక్కుకున్న విధానం
మోడ్రన్​ ఇండియాలో మరెన్నో ఇబ్బందులు
పేదలకు, పెద్దలకు మధ్య అంతరాలు
చట్టసభల్లోనూ ఏకపక్ష నిర్ణయాలు
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలి
పోరాడి సాధించిన స్వరాజ్యానికి అప్పుడే తగిన ఫలితం

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: గతానికీ, వర్తమానానికీ జరిగే అనంత సంభాషణే చరిత్ర అంటాడు బ్రిటిష్ హిస్టోరియన్​, దౌత్య‌వేత్త (డిప్లొమాట్​) అయిన ఈహెచ్‌ ‌కార్‌. దేశ చరిత్రలో సముజ్వల ఘట్టమైన స్వరాజ్య పోరాటంపై నేడు మననం చేసుకోవటం సముచితం. చరిత్రాత్మకమైన ఆ పోరాటమే కుల, మత, వర్ణ, వర్గాలకు అతీతంగా జాతిని ఒక్కటి చేసింది. సాంస్కృతిక ఐక్యతే తప్ప, సామాజిక, రాజకీయ ఐక్యత లేని దేశాన్ని ఒక మాట మీదకు తెచ్చిన ఘనత మన స్వాతంత్య్ర‌ సమర యోధులదే. నాటి పోరాటయోధుల సమున్నతమైన ఆలోచనలు, వారు రూపొందించిన రాజ్యాంగం దేశాన్ని నేటికీ ఐక్యంగా నడిపిస్తున్నాయి. అందుక‌ని ఈ 78వ స్వాతంత్య్ర‌ దినోత్సవం వేళ.. ఆ మహనీయులందరినీ స్మరించుకోవడం జాతి ముందున్న బాధ్యత.

- Advertisement -

సిఫాయిల తిరుగుబాటుతో మొద‌లై..

సిపాయిల తిరుగుబాటుతో మొదలైన 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర పోరాటం, దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి రావటం, సత్యం, అహింసా శక్తిని అక్షర జ్ఞానం లేని కోట్లాదిమందికి తెలియజేయటం, తిలక్‌ ‌సంపూర్ణ స్వరాజ్య నినాదం, పోరుబాటలో నడిచిన భగత్ సింగ్ వంటి విప్లవవీరుల త్యాగం, చలో ఢిల్లీ పిలుపు నిచ్చిన నేతాజీ ‌సాహసం, రేపటి భారతపు సమస్యలను ముందుగానే చెప్పి, వాటికి పరిష్కారాలు సూచించిన అంబేద్కర్ దూరదృష్టి.. జాతి జనులను స్వాతంత్య్ర‌ పోరాటంలో భాగస్వాములను చేశాయి. కొన్ని సందర్భాల్లో ఆంగ్లేయుల దమనకాండతో ఈ పోరాటం చల్లారిన సమయంలో.. ఎందరో వీరులు ఆ స్వాతంత్య్ర ఆకాంక్షలను సజీవంగా ఉంచేందుకు చేసిన పోరాటాలనూ మనం స్మరించుకోవాల్సి ఉంది.

ప్ర‌జా సంఘాల ఐక్య పోరాటాలు..

1885 నాటికే మహారాష్ట్ర, ఉమ్మడి బెంగాల్‌, ‌మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలలో కొన్ని చురుకైన ప్రజా సంఘాలు ఐక్య పోరాటాలే.. భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటుకు భూమికను ఏర్పరచాయి. మరోవైపు.. కాంగ్రెస్‌ ఆవిర్భవించడానికి వందేళ్ల క్రితమే దేశంలోని ఆదివాసీ, గిరిజన ప్రాంతాలు స్వేచ్ఛా నినాదాలతో మారుమోగాయి. గిరిజనోద్యమాలు, రైతాంగ ఉద్యమాలుగా అవి చరిత్రకెక్కాయి. అయితే.. తొలినాళ్లలో కాంగ్రెస్‌ చేపట్టిన ‘ప్లీ.. ప్రే.. పిటీషన్’ ధోరణిని కాదని అదే కాంగ్రెస్‌కు చెందిన తిలక్ పూర్ణ స్వరాజ్యం కోసం నినదించారు. తర్వాత అదే కాంగ్రెస్ నడిపించిన ‌బెంగాల్‌ ‌విభజన కారక వందేమాతర ఉద్యమం, 1919 నాటి సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాలు జాతిని ఐక్యంచేసి దేశాన్ని తెల్లవారి పాలన నుంచి విముక్తం చేశాయి.

ఊహించ‌ని విధంగా అంత‌రాలు..

ఇక.. వర్తమానానికి వస్తే, దేశంలో పేదలకు, పెద్దలకు మధ్య అంతరాలు వేగంగా, ఊహించనంత స్థాయిలో పెరిగిపోతున్నాయి. దేశంలోని కేవలం 100 మంది సంపన్నుల వద్ద ₹ 57 లక్షల కోట్ల సంపద పోగుపడిందని నివేదికలు చెబుతుండగా.. 18 కోట్ల మంది రెండు పూటలా మంచి ఆహారానికి నోచుకోవటం లేదని అదే నివేదకల్లో ఉంది.. 15‌‌–49 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు 51 శాతం మంది రక్తహీనతతో, ఐదేండ్ల లోపు పిల్లల్లో 35 శాతం మంది ఎదుగుదల సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకుందనే మాట నిజమే.. అయినా పార్టీల్లో పెరుగుతున్న ఏకపక్ష పోకడలు, ఆధిపత్య భావజాలం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

చట్టసభల్లోనూ ఏకపక్ష నిర్ణయాలు..

భారీ మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాలు దేశపు బహుళత్వపు విలువలకు విఘాతం కలిగించేలా, చర్చకు అవకాశం ఇవ్వకుండానే చట్టాలు చేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజ్యాంగం ప్రవచించిన విలువలు తరచూ అపహాస్యం పాలయ్యే ఘటనలు రాజకీయాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా అందరికీ సమాన అవకాశాలు లేని కారణంగా ఒకే భారత దేశంలో అనేక దేశాలున్నట్లు అనిపిస్తోందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ వైరుద్ధ్యాలను అర్థం చేసుకుని ఇకనైనా స్వాతంత్య్ర ఫలాలను చిట్టచివరి మనిషి వరకు అందేలా మన పాలకులు ప్రయత్నిస్తేనే.. మన పూర్వీకులు పోరాడి సాధించిన స్వరాజ్యానికి తగిన ఫలితం దక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement